ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
మంచిర్యాల, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కరీంనగర్లో సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ఏఐటీయూసీ(AITUC) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(CPI)–ఏఐటీయూసీ(AITUC) జిల్లా కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు కోరారు. శనివారం మంచిర్యాల ఐబీలో మహాసభల లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు.
కార్మికులు, రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి కార్పొరేట్ సంస్థలకు అనుకూల విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. జీడీపీ పెరుగుతున్నా నిరుద్యోగం, కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రత, రైతుల ఆదాయంలో ఆశించిన మార్పు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.ప్రజల కొనుగోలు శక్తి, ఉపాధి అవకాశాలు, కార్మికుల వేతనాలు, రైతుల ఆదాయం, సామాజిక భద్రత మెరుగుపడినప్పుడే నిజమైన ఆర్థిక అభివృద్ధి సాధించినట్లని అన్నారు.
కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ పరిరక్షణ, ఉపాధి భద్రత కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖలీందర్ అలీఖాన్, జోగుల మల్లయ్య, మిట్టపల్లి పౌలు, లింగం రవి, కొట్టే కిషన్రావు, వనం సత్యనారాయణ, మిర్యాల రాజేశ్వర్రావు, చాడా మహేందర్రెడ్డి, కాదండి సాంబయ్య, ఎగుడ మొండి, పానుగంటి సత్యనారాయణ, మండ యాదగిరి, బియ్యాల రాజేశం తదితరులు పాల్గొన్నారు.






