కేటీఆర్కు ప్రశ్నావళి సంధించిన సుడా మాజీ చైర్మన్
ముకరంపుర, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్మెంట్(Fee Reimbursement), జాబ్ క్యాలెండర్(Job Calendar)పై మాట్లాడడానికి కరీంనగర్ విచ్చేస్తున్న కేటీఆర్(KTR)ను ఉద్దేశించి సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Komatireddy Narendar Reddy) ప్రశ్నావళి సంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాతే కరీంనగర్లో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.
శనివారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు మీ హయాంలో రూ.5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఇంటర్ ఫలితాలు తప్పుగా ప్రకటించడంతో 24 మంది విద్యార్థుల మరణానికి కారణమైంది మీరని, అలాగే గ్రూప్ పరీక్షలు లీక్ కావడం వల్ల పరీక్షలకు ప్రిపేర్ అయిన విద్యార్థులు, నిరుద్యోగుల మానసిక క్షోభకు బాధ్యులు మీరు కాదా అని ప్రశ్నించారు.
2014, 2018 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మీ హయాంలో యూనివర్సిటీలకు పూర్తి స్థాయి వీసీలను కూడా నియమించలేదని పేర్కొంటూ పలు ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.






