వృద్ధులకు గడి ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు
ఎనిమిదేళ్లుగా ప్రతి నెలా వైద్య శిబిరాల నిర్వహణ
దోమకొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులతో వైద్య సేవలు పొందలేని వృద్ధులకు అండగా నిలుస్తూ దోమకొండ గడి ట్రస్ట్(Domakonda Gadi Trust) సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం గడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని(Free Medical Services) నిర్వహించారు. డాక్టర్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరానికి గ్రామంలోని 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా సుమారు 80 మంది వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన వారికి వైద్యుల సూచనల మేరకు ఉచితంగా మందులను అందజేశారు. వృద్ధులకు వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
గడి ట్రస్ట్ ద్వారా ఎనిమిదేళ్లుగా నిరంతర సేవలు గ్రామంలోని 60 సంవత్సరాలు పైబడిన నిరుపేద, నిస్సహాయ వృద్ధులకు గత ఎనిమిదేళ్లుగా ప్రతి నెలా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు గడి ట్రస్ట్ మేనేజర్ బాబ్జి తెలిపారు. అపోలో హాస్పిటల్కు చెందిన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వృద్ధులకు ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.