పత్తి పంటకు సూక్ష్మ పోషకాలే కీలకం...
- చెన్నూర్ ఏడీఏ
చెన్నూర్, (విజయక్రాంతి): పత్తి పంటలో దిగుబడులు పెంచాలంటే కేవలం ఎరువుల వినియోగమే కాకుండా సూక్ష్మ పోషకాల సమతుల్యతపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని చెన్నూర్ డివిజన్ సహాయ వ్యవసాయ శాఖ సంచాలకులు (ఏడీఏ) బానోతు ప్రసాద్(ADA Banothu Prasad) సూచించారు. ఆత్మ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్లో పత్తి పంటలో సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యతపై నిర్వహించిన క్షేత్ర ప్రదర్శనలో ఆయన మాట్లాడారు.
జింక్, మెగ్నీషియం, బోరాన్, మాలిబ్డినమ్, కాపర్ తదితర సూక్ష్మ పోషకాలు మొక్కల ఎదుగుదల, పంట నాణ్యత, దిగుబడిపై చూపే ప్రభావాన్ని ప్రదర్శన ద్వారా వివరించారు. రైతులు పంటలో కనిపించే పోషక లోపాలను గుర్తించి, అవసరానికి అనుగుణంగా తగిన పోషకాలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. కేవలం అధిక మోతాదులో ఎరువులు వాడటం కాకుండా, పంట అవసరాలను గుర్తించి సమతుల్య పోషక యాజమాన్యం పాటించడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చన్నారు.