calender_icon.png 13 October, 2024 | 12:49 PM

అమ్మాయిలు హీరోలు అని చెప్పే చిత్రం జిగ్రా

09-10-2024 12:00:00 AM

అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిగ్రా’ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రానా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్, నటుడు రానా దగ్గుబాటి, స్టార్ హీరోయిన్ సమంత ముఖ్య అథితులుగా విచ్చేశారు.

త్రివిక్రమ్, సమంత చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘రజినీకాంత్‌కు అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తర్వాత సమంతకే ఉన్నారనిపిస్తుంది. జిగ్రా కోసం ఆలియా ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఫలితం గురించి ఆలోచించకుండా సినిమాను తీసే ధైర్యం వాసన్‌కు ఉంది.

ప్రయత్నపూర్వకంగా చేస్తే సక్సెస్ కాదని, నది ప్రవాహాంలా సహజంగా జరిగిపోవాలని నమ్ముతాను’ అన్నారు. సమంత మాట్లాడుతూ.. ‘హీరోయిన్లుగా మాపై కొంత బాధ్యత ఉంటుంది. అమ్మాయిలు.. తమ జీవితాలకు తామే హీరోలు అని చెప్పేందుకు ఇలాంటి కథలు చెప్పాల్సి వస్తుంది. రాహుల్, త్రివిక్రమ్, సురేశ్ ప్రొడక్షన్స్.. నా జిగ్రాలు. ప్రతీ అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలి.

తెలుగు ప్రేక్షకుల ప్రేమ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా’ అని చెప్పారు. ‘మెస్సేజ్ చేయగానే వచ్చిన త్రివిక్రమ్‌కు థాంక్స్. మీరు మాట్లాడిన ప్రతీ మాట గుండెల్ని తాకింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో సమంత రియల్ హీరో. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది.

మంచి చిత్రాన్ని ప్రేమించడం, ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే నా గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేశాం’ అని ఆలియా భట్ అన్నారు. కార్యక్రమంలో వాసన్ బాలా, రాహుల్ రవీంద్రన్, వేదాంగ్ రైనాతోపాటు మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.