08-02-2025 12:00:00 AM
మెదక్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి) ః యువతరంలో రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోంది. పంచాయతీ, ఎంపీ టీసీ ఎన్నికలలో పోటీ చేయడానికి పలువురు ఉత్సాహం చూపుతున్నారు. సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతు న్నారు. శుభాశుభ కార్యాలకు హాజరవుతూ జనం దృష్టిలో పడేందుకు నానా పాట్లు పడుతున్నారు.
పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగిసి సుమారు ఏడాది కావస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేకపోయినా..సర్పంలుగా పోటీ చేయాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు. చాలా గ్రామాలలో రాజకీయ చైతన్యం ఉన్నవారు ముందస్తుగానే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
ఆరేడు నెలలుగా సేవా కార్యక్రమా లతో జనంలో ఉంటు న్నారు. వినాయక చవతి ఉత్సవాల సమయంలో యువజన సంఘాలు, కుల సంఘాలకు వినాయక విగ్రహాల కొని ఇవ్వ డానికి పోటీ పడ్డారు. దుర్గా నవ రాత్రుల సమయం లోనూ పలువు రు అమ్మవారి విగ్రహాల కొనుగోలుకు, మండపాలకు చందాలు ఇచ్చారు.
గ్రామా లలో ఎవరైనా చనిపోతే చాలు అక్కడికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు పరామర్శించడం, అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన వారు చనిపోతే ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లకు తప్పనిసరిగా హాజరవుతున్నారు.
మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 493 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో 4,232 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 5,19,009 మంది ఉండగా వారిలో పురుషులు 2,49,925 మంది, మహిళలు 2,89,074 మంది, ట్రాన్స్ జెండర్లు 9 మంది ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 4,210 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
ఫ్లెక్సీలతో హల్ చల్..
ఎన్నికలే లక్ష్యంగా అశావహులు పావులు కదుపుతు న్నారు. ఇప్పటి నుంచే జనంలో ఉండడం ద్వారా ఎన్నికల్లో సత్తా చాటాలని ఆరాటపడుతున్నారు. పండుగల సందర్భం గా గ్రామంలో ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు కడుతున్నారు. సందర్భానికి తగినట్లుగా రోడ్ల వెంట రకరకాల ఫ్లెక్సీలు తయారు చేయించి అందరి దృష్టిని ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు.
రిజర్వేషన్ ఖరారు కోసం ఎదురుచూపులు..
పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నవారంతా ఎన్నికల షెడ్యూల్తో పాటు రిజర్వేషన్ల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున తమకు రిజర్వేషన్ అనుకూ లంగా వస్తుందన్న ఆశతో చాలా మంది ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.