28-03-2025 05:20:15 PM
అత్యవసరంగా రక్తదానం చేసిన స్నేహితులు
జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు
కామారెడ్డి,(విజయక్రాంతి): ఇప్పుడున్న సమయంలో అందరూ బిజీగానే ఉంటారు.. ఖాళీగా ఎవ్వరు ఉండరు. కానీ తన మిత్రుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకొని కొందరు మిత్రులు వెంటనే వెళ్లి రక్తంను దానం చేసి మానవత్వం చాటారు. మానవత్వం ఇంకా బ్రతికే ఉన్నదని గట్టిగా నమ్మే వ్యక్తులే కాచాపూర్ యువకులు. అత్యవసరంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో రక్తహీనతతో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి అశోక్ కు 5 యూనిట్ల ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉండగా ఒక్క ఫోన్ కాల్ తో శుక్రవారం హైదరాబాద్ వెళ్లి రక్తదానానికి ముందుకు వచ్చిన అశోక్ స్నేహితులు సింగం సాయి కుమార్, రాధారపు సుభాష్, మర్రి హరీష్, మోతె సమిత్ రెడ్డి, జగదీష్ గౌడ్ హుటాహుటిన వెళ్లి రక్తదానం చేశారు.
ఈ కాలంలో కన్న పేగు బంధం పెంచిన ప్రేమ బంధం తోడుంటానని ఏడడుగులు నడిచిన భార్య భర్తలు దూరమవుతున్న ఈ సమయంలో స్నేహాని కన్న మిన్న ఏదీ లేదురా అనే పాటను నిజం చేస్తూ కాచాపూర్ యువకులు తన మిత్రునికి అత్యవసర సమయంలో రక్తదానం చేసి తమ మితృత్వాన్ని చాటారు. ఈ సందర్బంగా అత్యవసరంగా రక్తదానం చేసిన రక్తదాతలను కాచాపూర్ గ్రామ ప్రజలు పెద్దలు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు అభినందించారు.ఈ కార్యక్రమంలో బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.