calender_icon.png 4 October, 2024 | 2:56 PM

మీ ప్రదర్శన స్ఫూర్తిదాయకం

13-09-2024 12:56:09 AM

న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో 29 పతకాలతో సత్తా చాటి స్వదేశానికి చేరుకున్న భారత పారా అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో అథ్లెట్లు మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ప్రధాని మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘ మీ ప్రదర్శన అద్వితీయం. టోక్యోను మించిన ప్రదర్శనతో 29 పతకాలు సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఎంతో మందికి ఇది స్పూర్తి దాయకం’ అని మోదీ పేర్కొన్నారు.

వరుసగా రెండో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖరాను ప్రధాని మోదీ అభినందించారు. జుడోకాలో తొలిసారి దేశానికి పతకం తీసుకొచ్చిన కపిల్ పర్మర్ సాధించిన కాంస్యంపై ప్రధాని మోదీ సంతకం చేయడం ఆసక్తి కలిగించింది. అనంతరం పారాలింపిక్స్‌లో మీ అనుభవాలు ఎలా ఉన్నాయో చెప్పాలంటూ ప్రధాని మోదీ ప్రశ్నించగా.. అథ్లెట్లు తమదైన శైలిలో సమాధానాలు ఇవ్వడంతో నవ్వులు విరపూశాయి.

కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో పాటు పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝరియా పాల్గొన్నారు. వచ్చే పారాలింపిక్స్ వరకు 50 పతకాలే లక్ష్యంగా సిద్ధమవుతున్నట్టు దేవేంద్ర తెలిపారు.