వైద్యుల నిర్లక్ష్యమే మృతి కారణమని ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన
కాప్రా,(విజయక్రాంతి): ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో యువతి మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలు బంధువులు ఆస్పత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన నిఖిత(23) తన చదువు నిమిత్తం మేడిపల్లికి వచ్చి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటూ చదువుకుంటుంది. కాగా గురువారం నిఖితకు చాతిలో నొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం కాప్రా సర్కిల్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తా కమలానగర్లో ఉండే శ్రీకర రాఘవేంద్ర ఆసుపత్రికి ఆమె కుటుంబ సభ్యులు తీసుకోచ్చారు. నిఖితకు వైద్య అందించిన వైద్యులు యువతి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు.
విషయము తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చి నికిత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ.. ఆస్పత్రి ముందు బైఠాయించారు. ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చిన లిఖిత వైద్యల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. మెడికల్ మాఫియాపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, నిఖిత మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకొవాలని బంధువులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో వెంటనే పోలీసులు చేరుకుని ఆస్పత్రి యాజమాన్యం, బంధువులతో చర్చించి పరిస్థితి చక్కదిద్దారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.