16-04-2025 12:12:33 AM
ఎల్బీనగర్, ఏప్రిల్ 15 : ప్రియుడు పెండ్లికి నిరాకరించడంతో హాస్టల్లో ఉంటున్న యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్ సుఖ్ నగర్ మధురపురి కాలనీ ఉన్న శ్రీ సాయిరాం హాస్టల్ లో ఆదివారం రాత్రి మల్లేశ్వరి అనే యువతి ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాలు..
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లేశ్వరి దిల్ సుఖ్ నగర్ లోని మధురపురి కాలనీలో శ్రీ సాయిరాం హాస్టల్ లో ఉంటూ నిమ్స్ దవాఖానలో స్టాప్ నర్సుగా పని చేస్తున్నది. కాగా, అదే గ్రామానికి చెందిన యువకుడు జానారెడ్డి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించలేదు. దీంతో ప్రేమించిన యువకు డు నెల రోజుల క్రితం మరో యువతిని పెండ్లి చేసుకున్నాడు.
ఈ ఘటన తో మనస్తాపానికి గురైన మల్లేశ్వరి ఆదివారం హాస్టల్ బాత్రూమ్ లో అధిక మోతాదులో మత్తు మందు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్యకు ముందు తన చావు కు కారణమైన 9 మంది పేర్లు మెసేజ్ చేసినట్లు సమాచారం. యువతి ఆత్మహత్యపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లీశ్వరి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జానారెడ్డిని సరూర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.