వికారాబాద్, ఫిబ్రవరి -6: విద్యార్థులు గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు అయ్యేలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ విద్యార్థులకు సూచించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు గురువారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో ప్రేరణ మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలపై తర్ఫీదు , మనోధైర్యాన్ని, వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంచేందుకు నిష్ణాతులైన ఉపాధ్యాయల తో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రేరేపకులు (మోటివెటర్స్) మోటివేషన్ తరగతులు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్షలు అతి సమీపంలో ఉన్నందున సమయం వృధా చేయకుండా, ప్రతి సబ్జెక్టులో తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదరికంతోపాటు సమాజంలో ఎంతో వివక్షతకు గురైనప్పటికీ తను లక్ష్య సాధన దిశగా పయనిస్తూ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని ఇలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ ( స్టేషనరీ )అందించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం, సిబ్బంది పాల్గొన్నారు.