calender_icon.png 22 October, 2024 | 6:49 PM

అవును.. అది మా పనే

22-10-2024 02:59:56 AM

  1. జమ్మూ కశ్మీర్‌లో వలస కూలీలపై దాడి చేసింది మేమే
  2. పాక్ ఉగ్రసంస్థ లష్కరేతోయిబా ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఆదివారం రోజు జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో జరిగిన టెర్రర్ అటాక్ తమ పనే అని పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ శాఖ ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ వెల్లడించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు వలస కూలీలతో పాటు ఓ డాక్టర్ కూడా మరణించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

టీఆర్‌ఎఫ్ చీఫ్ షేక్ సాజిద్ గుల్ ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్ అని, అతడి ఆదేశాల ప్రకారమే ఉగ్రవాదులు కశ్మీరీలతో పాటుగా బయటి వారిని కూడా లక్ష్యంగా చేసుకుని ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. 2022లోనే నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అతడితో పాటు మరో ముగ్గురు సఫియుల్లా, సలీం, బసిత్ తలల మీద రూ. 10 లక్షల రివార్డును ప్రకటించింది.

సఫియుల్లా, సలీం పాక్‌లో నివాసం ఉంటుండగా.. బసిత్ మాత్రం జమ్మూలోనే నివాసం ఏర్పరచుకుని మంచు లోయలో అనేక దాడులకు ప్రణాళికలు రచిస్తున్నాడు. టీఆర్‌ఎఫ్ కశ్మీర్‌లో చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తోంది. కశ్మీరి పండిట్లు, సిక్కులు, బయటి వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది.