calender_icon.png 2 October, 2024 | 11:51 PM

త్వరలో రెజ్లింగ్ సూపర్ లీగ్

17-09-2024 12:23:54 AM

న్యూఢిల్లీ: ఐపీఎల్, ఐఎస్‌ఎల్, ప్రొ కబడ్డీ లీగ్ తరహాలో త్వరలో రెజ్లింగ్ చాంపియన్స్ సూపర్ లీగ్ (డబ్ల్యూసీఎస్‌ఎల్)కు తెరలేవనుంది. భారత రెజ్లర్ అమన్ షెరావత్‌తో పాటు మాజీ రెజర్లు సాక్షి మాలిక్, గీతా ఫొగాట్‌లు డబ్ల్యూసీఎస్‌ఎల్ ప్రారంభించనున్నట్లు సోమవారం మీడియాకు తెలిపారు. కాగా దీనికి జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) నుంచి అనుమతి రావాల్సి ఉంది. ‘సాక్షి, నేను చాలా కాలంగా ఈ లీగ్‌ని ప్లాన్ చేస్తున్నాము. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనుంది. సమాఖ్యతో మాట్లాడాల్సి ఉంది. ఈ లీగ్‌కు ప్రభుత్వం, సమాఖ్య నుంచి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం. కేవలం ఆటగాళ్ల ప్రతిభను ప్రోత్సహించడమే లీగ్ ప్రధాన ఉద్దేశం. ఎలాంటి రాజకీయాలకు తావు లేదు’ అని గీతా ఫొగాట్ పేర్కొంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్ కాంస్యం నెగ్గగా.. 2012లో వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గీతా కాంస్యం ఒడిసిపట్టింది. ఇక అమన్ ఇటీవలే పారిస్ ఒలింపిక్స్‌లో 57 కేజీల విభాగంలో కాంస్యం ఒడిసిపట్టిన సంగతి తెలిసిందే.