09-04-2025 12:57:13 AM
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): పాలమూరు లిఫ్ట్ ఇరి గేషన్ పనులు ‘ఒక అడుగు ముందుకు వేస్తే.. నాలుగు అడుగులు వెనక్కి..’ అన్న చందాన నడుస్తున్నాయి. వట్టెం పంప్హౌజ్ వద్ద 40 రోజుల నుంచి సర్జ్ఫూల్, ట్విన్ టన్నెళ్లలో వరద నీటిని తోడుతున్నా.. గతేడాది ఆగస్టు నుంచి ఆ పని ఒడవని ముచ్చటగానే మిగిలిపోతున్నది.
మరోవైపు నీటిని తోడేందుకు అయిన విద్యుత్ బిల్లు రూ.7 కోట్లు ఎలా చెల్లించాలనే అంశంపై తకరారు మొదలైంది. తమకు సంబంధం లేదంటే.. తమకు సంబంధం లేదంటూ ఇటు నీటిపారుదల శాఖ, అటు నిర్మాణ ఏజెన్సీ మిన్నకుండిపోతున్నాయి. చివరకు బిల్లు ఎవరు చెల్లిస్తారనేది మిలియన్ డాల ర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
అసలేం జరిగిందంటే..
గతేడాది వానకాలంలో కురిసిన వర్షాలకు వరదంతా పంప్హౌజ్కు 14 కి.మీ దూరంలో ఉన్న శ్రీపురం వద్ద ప్యాకేజీ 7 ఆడిట్ (ద్వారం) నుంచి రెండు టన్నెళ్ల ద్వారా (ట్విన్ టన్నెల్స్) వట్టెం సర్జ్ఫూల్ పంప్హౌజ్లోకి చేరింది. దీంతో అప్పటికే బిగించిన నాలుగు 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటా రు పంపులు, బిగించేందుకు సిద్ధం చేసిన మరో ఆరు మోటర్లు నీట మునిగాయి. 40 రోజుల నుంచి ఇరిగేషన్శాఖ వరదను తోడిపోసే పనులు ప్రారంభించింది.
ఈ క్రమంలో నీట మునిగిన మోటారు పంప్లు ఒక్కొక్కటి బయటకు వచ్చాయి కానీ.. కొత్త సమస్య తలెత్తింది. సర్జ్ఫూల్ నుంచి డ్రాఫ్ట్ ట్యూబుల ద్వారా గతంలో వరద పంప్హౌజ్లోకి ప్రవేశించింది. అం దుకే ఇరిగేషన్శాఖ ముందుగా సర్జ్ఫూల్లో మొదలయ్యే డ్రాఫ్ట్ ట్యూబుల షట్టర్లను మూ సేసింది. దీంతో డ్రాఫ్ట్ ట్యూబులు, పంప్హౌజ్లోని వరద అలాగే ఉండిపోయింది. దీం తో 40 రోజుల నుంచి వరదను తోడిస్తున్నా రు.
అందుకు అక్షరాలా రూ.7 కోట్ల వరకు విద్యుత్ బిల్లు వచ్చిందని తెలిసింది. సర్జ్ఫూల్తోపాటు సుమారు 18 కి.మీ పొడవైన ట్విన్ టన్నెళ్లలో ప్రస్తుతం వరద అలాగే నిలిచి ఉంది. నీటిపారుదలశాఖ అధికారులు ఒకే ఒక మోటరుతో సర్జ్ఫూల్ నుం చి నీటిని తోడిపోస్తున్నారు. మరోవైపు లీకేజీ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.
దీంతో ప్రస్తుతం సర్జ్ఫూల్లో సుమారు 30 మీటర్ల మేర వరద అలాగే నిలిచి ఉంది. మరో మూ డు నెలల్లో వర్షాకాలం రానున్నది. ఇక అ ప్పుడు నీటి తోడివేత సంగతేంటి? అనే ప్రశ్న మొదలైంది. ఇక సర్జ్ఫూల్లో నీటి తోడివేత సంగతేంటని ఇరిగేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.