calender_icon.png 23 October, 2024 | 12:56 PM

తెలంగాణలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు

04-08-2024 03:37:02 PM

క్షేత్రస్థాయిలో  అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందిస్తాం

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించింది: మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్ నగర్: టూరిజం స్టడీ టూర్ లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేల బృందం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో సరళా సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో  ప్రపంచ స్థాయి  పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు.  తెలంగాణ ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక, వారసత్వ సంపదకు నెలవుగా ఉందని తెలిపారు.

ఎన్నో అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ  గడచిన పది సంవత్సరాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా  ఉమ్మడి పాలమూరులో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, పర్యాటకులను ఆకర్షించడం,  పర్యాటక  ప్రాంతాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడం, మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, తదితర అంశాలపై అధ్యాయనం చేస్తున్నామని వివరించారు.

ఆసియా ఖండంలోనే రెండవదైన ఆటోమెటిక్ సైఫాన్ సిస్టం కలిగిన సరళా సాగర్ తో  పాటు కోయిల్ సాగర్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. టెంపుల్ టూరిజంలో భాగంగా కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వంశీ కృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేఘరెడ్డి, అనిరుధ్ రెడ్డి, CWC మెంబర్ చల్లా వంశీచంద్ రెడ్డి,  ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.