20-04-2025 08:02:50 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, హక్కుల సాధన కోసం ఈనెల 21, 22 తేదీల్లో హైదరాబాదులోని శంషాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు తరలిరావాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదె లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాసభ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం మహాసభలో చర్చించడం జరుగుతుందని, హక్కుల సాధన కోసం భవిష్యత్తులో అనుసరించాల్సిన విధివిధానాలను ఖరారు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఐటియుసి అధ్యక్షుడు అజయ్ సారధి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రేషన్ పల్లి నవీన్, మంద శంకర్, వెలుగు శ్రావణ్, యాకయ్య, శ్రీను, ప్రవీణ్, స్వామి, శ్రీకాంత్, శ్రీనాథ్, వెంకన్న పాల్గొన్నారు.