శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): విద్యుత్ షాక్ తగిలి నిర్మాణంలో ఉన్న భవనం పైనుండి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జనాగం జిల్లా వరికుప్పల గ్రామానికి చెందిన యాదగిరి(45) కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ మియాపూర్ లోని మయూరి నగర్ లో కొత్తగా నిర్మిస్తున్న భవనంలో క్రేన్ ఆపరేట్ గా పని చేస్తున్నాడు. సోమవారం పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి యాదగిరి మూడో అంతస్తు నుండి కింద పడిపోయాడు. దీంతో యాదగిరి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.