కామారెడ్డి, మే 4 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ 19వ వార్డులోని గౌలిగూడలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్యతో పాటు పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా సమస్యలను పట్టించుకోకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అంజిరెడ్డి, ఎర్వల కృష్ణారెడ్డి, దాసరి శ్రీనివాస్, గురువినయ్, శ్రీధర్, రవీందర్, ఉదయ్, వహబ్ తదితరులు పాల్గొన్నారు.