21-02-2025 12:50:09 AM
గద్వాల, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): జాబ్కార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. గురువారం గట్టు మండలంలోని మండల మహిళా సమాఖ్య భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. జాబ్కార్డు సృష్టి, డేటా ఎంట్రీ వివరాలను, రిజిస్టర్ లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో చర్చించి, ఉపాధి హామీ పనుల అమలుపై స్పష్టమైన సూచనలు అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామీణ వర్గాల అభివృద్ధికి,వారికి అవసరమైన జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణ మరియు సాధికారత కల్పించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తుందని తెలిపారు. వ్యవసాయ పనులు పూర్తవుతున్న నేపథ్యంలో, ఉపాధి హామీ పనుల ద్వారా మరిన్ని గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి హామీలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, ప్రతి కుటుంబానికి జాబ్కార్డు ఉండేలా చర్యలు తీసుకుని, వారు పని కోసం డిమాండ్ చేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెరిగేలా క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పనులు పారదర్శకంగా సాగేందుకు ప్రతి పనికి సంబంధించి మెజర్మెంట్ బుక్ పూర్తిగా స్పష్టంగా ఉండాలని, పనుల కొలతలు, వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. అన్ని రిజిస్టర్లు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా పనులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పథకంతో క్రింద చేపడుతున్న పనుల వివరాలను అడిగి కలెక్టర్ తెలుసుకున్నార్., ఏపీవోలు,ఈసీ,ఫీల్డ్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండి పనుల పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఎంపీడీఓ చెన్నయ్య,ఏపీఓ స్వామి,టెక్నికల్ అసిస్టెంట్స్, ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ,తదితరులు పాల్గొన్నారు.