18-04-2025 03:20:08 PM
సోషల్ మీడియాలో ఫేమస్(Social Media Famous) అయిపోవాలని ఇద్దరు యువతులు పంజాబ్లోని లూధియానా(Ludhiana)లో రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో గలీజ్ డ్యాన్సులు చేశారు. ట్రాఫిక్, వాహనాలు ప్రయాణిస్తున్నప్పటికీ, ఆ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో రీల్ రికార్డ్ చేశారు. సమీపంలోని ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు వాళ్ల వీడియోలను చిత్రీకరించారు, తరువాత వారు ఆ దృశ్యాలను వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. మహిళలు ఫ్లైఓవర్ కింద డాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. దీనివల్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఈ దృశ్యాలు చూపరులను ఆకర్షించాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ట్రాఫిక్ జామ్కు దారితీసింది. స్థానిక నివాసితుల ఫిర్యాదుల మేరకు, లూధియానా పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. "రహదారి మధ్యలో రీల్స్ చేయడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన. మేము వీడియోను పరిశీలిస్తున్నాము. మహిళలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము. దర్యాప్తు తర్వాత వారిపై చర్యలు తీసుకుంటాము" అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) గురుప్రీత్ సింగ్ అన్నారు. నివేదికల ప్రకారం, ఈ సంఘటన బుధవారం జరిగింది. ప్రజా రోడ్డు మధ్యలో ఇలాంటి విన్యాసాలు చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.