07-03-2025 12:43:45 AM
వనపర్తి, మార్చి 6 ( విజయక్రాంతి ) : మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించి, క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని నరసింగాయ్ పల్లి లో ఉన్న ఎం సి హె లో మహిళా సిబ్బందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ వంటి రోగాలు దరి చేరకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మన ప్రభుత్వ ఆసుపత్రిలో అనేక రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
డయాబెటిస్, రొమ్ము క్యాన్సర్, సర్వుకల్ క్యాన్సర్, విటమిన్ డి 3, విటమిన్ బి12, థైరాయిడ్ వంటి వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను మహిళా ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా వినియోగించుకుని తమ ఆరోగ్యంపై దృష్టి సారించా లాన్నారు. ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో పరీక్షలు చేయించుకునేందుకు అంగన్వాడీ టీచర్లు, ఏపీఎంలు, సీసీలు, స్వ యం సహాయక మహిళా బృందాలకు చెందిన మహిళలు తదితరులు హాజరయ్యారు.
క్రిటికల్ కేర్ యూనిట్ పరిశీలన
నర్సింగాయపల్లి ఎం సి హె ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. వేగంగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఏమాత్రం ఆలస్యం చేయవద్దని చెప్పారు.
మార్చి చివరిలోపు పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిజిఎంఎస్ఐడిసి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, ఎం సి డి ప్రోగ్రాం అధికారి రామచందర్, ఇతర వైద్యశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.