12-03-2025 01:27:20 AM
కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 11 (విజయక్రాంతి) : మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి,సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ,సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వయి హారీష్ బాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని, స్వశక్తితో ఎదిగి ఆర్థిక స్వాలంబన సాధించాలన్నారు. ఏ పనిలో విజయం సాధించాలన్నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో అవసరమవుతుందన్నారు. అనుకున్నది సాధించేందుకు శ్రద్ధతో లక్ష్యాన్ని చేరేలా పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. ఆడ, మగ తేడా లేకుండా పిల్లలందరిని సమానంగా చూడాలని అన్నారు.
సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా మాట్లాడుతూ రాబోయే భావితరాలకు మహిళలు ఆదర్శంగా నిలబడాలన్నారు. ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ పోటీ ప్రపంచంలో మహిళలు వాటిని తట్టుకుని విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించాలన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే కుటుంబ సభ్యులు, సమాజం వారిని గుర్తిస్తుందని తెలిపారు.
లోకంలో మహిళ తమ విలువను తెలుసుకోవాలని, ఆత్మ న్యూనతా భావాన్ని విడనాడాలన్నారు. భ్రూణ హత్యలు, బాల్యవివాహాలు అరికట్టినప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందని తెలిపారు.ఈసందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ , సీడీపీఓలు పాల్గొన్నారు.