హైదరాబాద్,(విజయక్రాంతి): అండర్ -19 మహిళల T20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచి టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించిన గొంగడి త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల మలేషియాలో జరిగిన మహిళ అండర్ -19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన త్రిష తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం ఆమెను శాలువాతో సత్కరించి, ప్రోత్సాహకంగా కోటి రూపాయలు నజరానా ప్రకటించారు.
భవిష్యత్తులో భారతదేశం తరఫున మరింతగా రాణించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల బహుమతిని ప్రకటించడంతో పాటు టీం సభ్యురాలు, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి రూ.10 లక్షలు, టీం హెడ్ కోచ్ నౌషీన్ అల్ ఖదీర్ కి, ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున బహుమతిని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన త్రిష సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన ఐవైసితో పాటు ఇతర ప్రముఖులు ఉన్నారు.