calender_icon.png 23 October, 2024 | 3:09 PM

మహిళలు అణచివేతకు గురవుతున్నారు!

01-10-2024 12:00:00 AM

హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. సినిమాల్లో నటించే ముందే మహిళలు వేధింపులకు గురవుతున్నట్లు కూడా తెలిపింది. మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని పేర్కొంది.

వేధింపుల ఆరోపణలతోపాటు, మగవాళ్లతో పోలిస్తే మహిళలకు చాలా తక్కువ వేతనం ఇస్తున్నారని చెప్పింది. అయితే నేటికీ హేమ కమిటీ రిపోర్ట్ తీవ్ర చర్చనీయాంశమవుతూనే ఉంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ ఇటీవల ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్)లో మీడియా ఇంటరాక్షన్‌లో స్పందించారు.

కమిటీ గురించి మాట్లాడుతూ.. శతాబ్దాలుగా భారతదేశంలో మహిళల అణచివేతకు గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 16వ శతాబ్దం నుంచి 21 శతాబ్దం వరకు మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నా, ప్రతిభను చాటుకుంటున్నా అణచివేతకు గురవుతున్నారని ఆమె అన్నారు. 

షబానా అజ్మీ ఇటీవలనే భారతీయ సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆమె చివరిసారిగా ‘కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’ మూవీలో కనిపించారు. ఇందులో ఆలియా భట్, రణవీర్ సింగ్, ధర్మేంద్ర, జయా బచ్చన్ కూడా నటించారు.

అయితే మహేష్ భట్ దర్శకత్వం వహించిన 1982లో తాను నటించిన ’అర్థ్’ సినిమాను తిరిగి విడుదల చేయాలనే కోరికను ఆమె వ్యక్తం చేశారు. మహిళా సాధికారతే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం అని అన్నారామె.