calender_icon.png 25 September, 2024 | 7:36 PM

కాళ్లు నొస్తున్నాయంటూ వెళ్లే కాటికి పంపించారు

25-09-2024 05:46:04 PM

వికటించిన ఆర్ఎంపీ వైద్యం

పట్టించుకోని అధికారులు పరారైన ఆర్ఎంపీ వైద్యుడు

కొండపాక,(విజయక్రాంతి): కాళ్లు నొస్తున్నాయంటూ వచ్చిన మహిళకు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించింది. ఆరు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరకమాను వహించిన మహిళ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తేలు మహేశ్వరి (40) కాళ్లు చేతులు వస్తున్నాయంటూ సమీప గ్రామం దుద్దెడలోని ఆర్ఎంపి వైద్యుడు ఆంజనేయులు సంప్రదించింది. పరీక్షించిన ఆర్ఎంపీ చికిత్స మొదలుపెట్టాడు. మహేశ్వరికి గ్లూకోస్ లు పెట్టిన ఆంజనేయులు తన క్లినిక్ నుంచి పని నిమిత్తం బయటకు వెళ్ళాడు. వాంతులు మొదలయి మాట రాకపోవడంతో మహేశ్వరి బందులు ఆర్ఎంపి వైద్యుడు ఆంజనేయులుకు సమాచారం ఇచ్చారు.

తానేం చేయలేనంటూ సిద్దిపేట ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చి ఆర్ఎంపీ చేతులు దులిపేసుకున్నాడు. హుటాహుటిన మహేశ్వరిని సిద్దిపేటలో ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె కోమలోకి వెళ్లినట్లు గుర్తించిన వైద్యులు హైదరాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు ఈనెల 19 తేదీ నుంచి బుధవారం వరకు హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న మహేశ్వరి బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. మహిళా మృతికి ఆర్ఎంపీ వైద్యుడు ఆంజనేయులు బాధ్యుడు అంటూ నిర్ధారించుకున్న కుటుంబ సభ్యులు బుధవారం సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అనంతరం దుద్దెడలోని ఆంజనేయులు నడుపుతున్న సాయి చరణ్ క్లినిక్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

పలువురు పెద్దలు కలగజేసుకొని బాధిత కుటుంబ సభ్యులకు ఆర్ఎంపి వైద్యంకి మధ్య ఒప్పందం కుదిరిచినట్లు తెలిసింది. మృతురాలు మహేశ్వరికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు. కాళ్ళు నొస్తున్నాయంటూ వైద్యం కోసం వచ్చిన మహిళను వచ్చిరాని వైద్యం చేసి కాటికి పంపించారంటూ కుటుంబీకులు ఏడవడం చూసిన వారందరినీ కంటతడి పెట్టించింది. గ్రామాలలో వైరల్ ఫీవర్ వ్యాప్తి చెంది ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆర్ఎంపీలు చేస్తున్న వైద్యం వికటించడం ప్రాణాల మీదికి వస్తుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన చికిత్స అందకపోవడం వల్లనే ఆర్ఎంపీలను ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారంటూ గ్రామీణ ప్రాంతం ప్రజలు తెలిపారు.