మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హత్య’. ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సోమవారం ప్రెస్మీట్ నిర్వహించారు.
దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ.. “ప్రశాంత్ వల్ల ఈ ‘హత్య’ చిత్రం ఈ స్థాయికి వచ్చింది. ‘మధ’ మూవీ రిలీజ్ చేయమని చాలా మందిని అడిగాను. కానీ ఇప్పుడు ఎవ్వరినీ అడగలేదు. మా ట్రైలర్ వచ్చాక డిస్ట్రిబ్యూటర్లే వచ్చి మా సినిమాను అడిగారు” అన్నారు. ఈ చిత్రం వైఎస్ వివేకా హత్య కేసు గురించేనని శ్రీవిద్య తెలిపారు.
అప్రూవర్గా మారిన వారి పాత్రలు, ఇతర పాత్రలుంటాయా? అని మీడియా ప్రశ్నించగా ఆమె కొంతమేర ఉంటాయని సమాధానమిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర చిత్రంలో ఉంటుందా? అని ప్రశ్నించగా సినిమా చూసి తెలుసుకోవాలని నవ్వుతూ చెప్పారు. ధన్యా బాలకృష్ణ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి నాకు విజయశాంతి, మాలశ్రీలాగా యాక్షన్ చిత్రాలు చేయాలని ఉండేది.
ఇప్పటికి ఆ కల నెరవేరింది. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది” అని చెప్పారు. పూజా రామచంద్రన్ మాట్లాడుతూ.. “మళ్లీ తెలుగు పరిశ్రమకు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు ఎంతో ప్రేమ లభిస్తుంటుంది. ‘స్వామి రారా’ నుంచి నన్ను ఆదరిస్తూనే ఉన్నారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రశాంత్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ నరేశ్ కుమారన్ తదితరులు పాల్గొన్నారు.