calender_icon.png 25 October, 2024 | 9:49 AM

మరో ప్రేమకథతో..

14-07-2024 01:25:53 AM

కథానాయకుడు ధనుష్ ఈ నెల 26న ‘రాయన్’గా థియేటర్లలోకి రానున్నారు. అపర్ణ బాలమురళి, సందీప్ కిషన్ తదితర తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ధనుష్ యాభైవ చిత్రం. కాగా దీనికి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. శేఖర్ కమ్ముల దర్శకుడిగా ‘కుబేర’ సినిమాలోనూ నటిస్తున్న ధనుష్, తర్వాత చిత్రాన్ని హిందీలో చేయనున్నారు. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘రాంఝనా’. బాలీవుడ్‌లో ధనుష్‌కి ఇదే తొలి చిత్రం కాగా, అనంతరం వీరిద్దరి కలయికలో ‘అట్రంగీ రే’ చిత్రం తెరకెక్కింది. ఈ రెండూ ప్రేమకథలే కాగా మరో ప్రేమకథతో వీరివురూ ప్రేక్షకుల మెప్పించేందుకు సన్నద్దమవుతున్నారు.

‘తేరే ఇష్క్ మే’ అనే టైటిల్ ఈ సినిమాకి ఖరారు చేసినట్టు సమాచారం. అక్టోబరు నుంచి చిత్రీకరణ ఆరంభం కానున్న ఈ సినిమా వారణాసి, ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో జరుగనుంది. ధనుష్ కలయిలో వచ్చిన ఈ రెండు ప్రేమకథలకి మంచి ఆదరణ లభించింది. సంగీతపరంగానూ మెప్పించిన ఈ సినిమాల తర్వాత ఇప్పుడు ముస్తాబవుతున్న ఈ ప్రేమకథ చిత్రంలో నాయికగా త్రిప్తి డిమ్రిని ఎంపిక చేశాయట చిత్ర వర్గాలు. గత రెండు చిత్రాలకి సంగీతం అందించిన ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి స్వరాలందిచనున్నారు. ప్రేమ లోతుల్లోకి తీసుకెళ్ళే ఆనంద్ ఎల్ రాయ్ సినిమా కోసం ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రేమికులు.