- ఏదేమైనా రాందాస్ మంత్రిగానే ఉంటారు..
- తోటి కేంద్ర మంత్రిని టీజ్ చేసిన గడ్కరీ
ముంబై, సెప్టెంబర్ 23: ‘మా ప్రభుత్వం నాలుగో సారి అధికారంలో వస్తుందో రాదో చెప్పలేం.. కానీ రాందాస్ అథవాలే మంత్రి అవుతారన్న గ్యారంటీ మాత్రం కచ్చితంగా ఉంది’ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోటిమంత్రికి చమక్కు విసిరారు. తాజాగా నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇలా వేదికపై నవ్వులు పూయించారు. ఇదే వేదికపై ఉన్న రాందాస్ అథవాలే సైతం ఉండగా.. ఆయన కూడా జోక్కు చిరునవ్వులు చిందించారు. తాను చేసిన వ్యాఖ్యలు కేవలం జోక్ లాగానే భావించాలని గడ్కరీ చెప్పడం కొసమెరుపు.
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) నేత రాందాస్ అథావాలే వరుసగా మూడోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ మరోసారి గెలిస్తే మరోసారి ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. మహారాష్ట్ర మహాయుతి కూటమిలో ఆర్పీఐ కూడా ఓ భాగం. 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆర్పీఐ పార్టీ సైతం ఎన్నికల్లో పోటీ పడుతున్నది.