calender_icon.png 21 September, 2024 | 1:52 AM

ఫార్మాసిటీ ఉంటుందా.. లేదా?

07-09-2024 12:44:49 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా సిటీ కొనసాగింపు చేస్తారో లేదో రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే ఈ నెల 20వ తేదీ నాటికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్ దాఖలు చేసి తీరాలని చెప్పింది. ఫార్మాసిటీ కొనసాగిస్తున్నారో లేదో వెల్లడిస్తే దానికి అనుగుణంగా తమ ముందున్న పిటిషన్లపై ముందుకు వెళతామని స్పష్టం చేసిం ది. ప్రభుత్వం వివరణ ఇవ్వడానికి ఇదే చివరి అవకాశమని వెల్లడించింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణ అవార్డు నోటిఫికేషన్‌ను సింగిల్ జడ్జి రద్దు చేస్తూ వెలువరించిన తీర్పు అమల్లోనే ఉందని చెప్పింది.

ఆ తీర్పు ను ప్రభుత్వం సవాల్ చేసినా మధ్యంతర ఉత్తర్వులు వెలువడలేదని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి తీర్పుతో తమ భూములపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ మేడిపల్లికి చెంది న రామచంద్రయ్య సహా సుమారు 50 మం ది దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది దివ్య వాదనలు వినిపిస్తూ అక్క డ బల్క్ డ్రగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం లేదని, లైఫ్ సైన్సెస్ వంటివి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారన్నారు.

దీనిపై న్యాయమూర్తి కల్పించుకుని ఏ అధికారి ఆ వివరణ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. పిటిషనర్ న్యాయవాది వాది స్తూ ఫార్మా సిటీ రద్దు చేస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారని, ఫార్మా సిటీ ఉండదని మంత్రి కూడా ప్రకటించారని తెలిపారు. వాదనల తర్వాత  ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నారా లేదా? ఆ భూముల్ని ఎందుకు వినియోగించబోతున్నారో వంటి విషయాలపై సమగ్రంగా కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.