06-03-2025 12:17:25 AM
వనపర్తి టౌన్ మార్చి 5: వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్యాల రోడ్డులో ఉన్న ఆదర్శ డబుల్ బెడ్రూం కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరిస్తానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హామీ ఇచ్చారు. కాలనీలో నెలకొన్న మంచినీటి సమస్యపై కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, కాలనీ ప్రజలు మంచినీటి కోసం నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
వేసవికాలం రావడంతో కాలనీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే బోర్లు వేయించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడారు. డబుల్ బెడ్రూం కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు, బోర్ల ద్వారా వాడుకుంటున్న నీళ్ల గురించి కాలనీకి వెళ్లి విచారణ చేసి తమకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కాలనీలో మంచినీటి సమస్య రాకుండా చూస్తానని ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ ను కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు ఫోన్లో సంప్రదించగా గురువారం కాలనీకి వచ్చి మంచినీటి సమస్యను పరిశీలించి పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మండ్ల రాజు, గోపాలకృష్ణ, జర్నలిస్ట్ నిరంజన్, తిరుపతి, జమ్మూ, సాయిలీల, బలరాం వెంకటేష్, విష్ణు సాగర్, వినోద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు