17-04-2025 12:29:32 AM
ఖమ్మం జిల్లాలో విషాదం
ఖమ్మం, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): భర్త చిన్నకర్మ రోజే భార్య గుండెపోటుతో మృతి చెందిన విషాదకర ఘటన బుధవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో జరిగింది. కుటుంబ సభ్యుల ప్రకారం ఏలువారి గూడెంకు చెందిన దిండు ఉపేందర్ (55) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు.
దీంతో అప్పటి నుంచి ఆయన భార్య పద్మ, భర్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైం ది. అప్పటి దాకా తనతో ఉన్న భర్త ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. తరచూ ఏడుస్తుండటంతో ఆమె అన్న తిరుమలాయపాలెంలోని తన ఇంటికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో మూడోరోజు బుధవారం మృతుడి చిన్నకర్మ ఉండటంతో పద్మ ఏలువారిగూడెం నుంచి భర్త ఇంటికి బయలుదేరుతుండగా గుండెపోటు వచ్చి, కుప్పకూలింది. వెంటనే ఆమెను గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కుటుంబంలో, గ్రామంలో విషాదం అలుముకుంది.