11-02-2025 12:57:02 AM
రాష్ట్రంలోని ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): తెలంగాణలో కరీంగనర్ -ఆది లాబాద్- నిజామామాద్-మెదక్, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు, కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నడుస్తున్నది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజే పీ మాత్రమే మూడింటా తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించింది.
రెండు టీచర్ ఎమ్మెల్సీల స్థానాల్లో బీజేపీ అభ్యర్థులుగా మల్క కొమురయ్య, సరోత్తమ రెడ్డిని బరిలో నిలిచారు. రెండుచోట్లా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి బరిలో ఉన్నారు.
ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలోనూ బీఆర్ఎస్ పోటీకి దూరం ఉంది. ఇలా బీజేపీ మూడుచోట్ల బరిలో ఉండడం, కాంగ్రెస్ కేవలం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయడం, బీఆర్ఎస్ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండడంపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఎన్నికలపై మూడు పార్టీల ఎత్తుగడలేంటనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
బీఆర్ఎస్ అనాసక్తిపై చర్చ..
నల్లగొండ- వరంగల్- ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి పీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు గాలిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి నామినేషన్ వేశారు. ఈయనకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందా? అనే అంశంపై ఎవరికీ స్పష్టత లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులైన టీచర్లు ఎవరిపక్షాన నిలుస్తారనే ప్రశ్న తలెత్తింది.
మరోవైపు బీఆర్ఎస్ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పోటీకి దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్టీ ఆవిర్భా వం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పోటాపోటీగా ఎన్నికల్లో చేసిన బీఆర్ఎస్.. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పోటీకి దూరంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకునే మండలి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని కాంగ్రెస్ నేత లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు సోమవారంతో గడువు ముగిసింది. ఆయా స్థానాల్లో పలువురు ఉపా ధ్యాయ సంఘాల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా మంది నామినేషన్లు వేశారు.
నామినేషన్ల ఉప సంహరణ తర్వా త, వీరిలో ఎంతమంది బరిలో ఉంటారనే అంశం పై మూడు రోజుల్లో స్పష్టత రానున్నది. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వారికి మద్దతుగా రాజకీయ పార్టీలు, ఉపాధ్యా య సంఘాలు జిల్లాలు, నియోజక వర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి.
ముగిసిన నామినేషన్ల పర్వం
కరీంనగర్/నల్లగొండ, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసింది. వరంగల్ (వరంగల్- ఖమ్మం-నల్లగొండ) ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 23 మంది అభ్యర్థులు 50 నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం వరకు 18 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. సోమవారం ఏకంగా 27 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.
కరీంనగర్(కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.