calender_icon.png 8 September, 2024 | 8:22 AM

‘వైకుంఠపాళి’లో ఎవరు ఎక్కడ?

10-07-2024 12:05:00 AM

తెలంగాణ ప్రజాక్షేత్రం గుంభనంగా ఉన్నా సుస్పష్టంగానే ఉంది. ఆరు మాసాల కింద ప్రజలు ఇచ్చిన తీర్పు ఫలితంగా భారీమార్పుతో పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం కొలువు తీరినా ఆశించిన వేగంతో మార్పు రావటం లేదనే భావన జనంలో నెమ్మదిగా బలపడుతున్నది. ‘ఇప్పుడిప్పుడే కదా! చూద్దాం, ముం దెలా ఉంటుందో?’ అన్న టైమ్ రెమిషన్ కూడా ఇప్పటికైతే ప్రజలు పాలక పక్షానికి ఇస్తున్నారు. నిరుద్యోగం, వ్యవసాయం (రైతుబంధు, రుణమాఫీ), పెన్షన్ల పెంపు, రేషన్ కార్డుల జారీ, ఇళ్ల నిర్మాణం...వంటి విషయాల్లో ఆశించిన వేగంగా మార్పు రావట్లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

లోడ్ షెడ్డింగ్ అని ‘సర్కారు వారు’ ఎన్ని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో కరెంట్ కోతల కటకట ప్రజలు పసిగట్టే స్థాయిలోనే ఉంది. హామీలవల్ల ధరణి విషయంలో జనమింకా ఆశావహంగా ఉన్నారు. ఫిర్యాదులు అపరిష్కృతంగానే ఉండటంతో వారికింకా పూర్తి తృప్తి లభించడం లేదు. కొత్త ప్రభుత్వమన్న బెరుకేమీ లేకుండా అన్ని స్థాయిల్లో ‘కాంగ్రెస్ తరహా’ అవినీతి మొదలైందని, అది వికేంద్రీకృతమవుతున్నదనే భావన ప్రజల్లో వచ్చింది. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మార్క్‌గానీ, అసలు కాంగ్రెస్ మార్క్‌గానీ ఇంకా రాలేదని వారంటున్నారు. రాబోయే నాలుగున్నరేళ్ల కోసం కాంగ్రెస్ సర్కారు గ్రాఫ్.. పైకా? కిందికా? అన్నది ఇక్కడినుంచే మొదలవచ్చు. ఆరు మాసాల గడువు, సార్వత్రిక ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్... అన్నీ ముగిసాయి కాబట్టి, సానుకూలతైనా, వ్య తిరేకతైనా వేగం పుంజుకునేది ఇప్పట్నుంచే అని తాజా పరిస్థితుల్నిబట్టి తెలుస్తున్నది.

‘పాలన జోడెడ్ల బండి

పార్టీగా కాంగ్రెస్‌ను ఎలా నడుపుతారనే విషయమై సొంత శ్రేణుల్లోనూ సందేహాలు ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్న పుడు తలెత్తే సమస్య ఇది. అటు పాలనకు, ఇటు పార్టీకి నేతృత్వం వహిస్తున్న రేవంత్‌రెడ్డిని తప్పించి పార్టీ పగ్గాలు మరో నేతకు అప్పగించే కసరత్తు ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రె స్‌లో చేర్చుకునే విషయానికి ప్రజలు పెద్ద గా ప్రాధాన్యత ఇస్తున్నట్టు లేదు. ఈ చర్యలకు వారి ఆమోదం ఉందనుకోవడానికీ లేదు. ‘బీఆర్‌ఎస్ చేసిన తప్పే, కాంగ్రెస్‌కూ డా చేస్తే తేడా ఏముంటుంది, ప్రజాతీర్పుకు విలువేముంది?’ అన్నది పార్టీ శ్రేణుల ప్రశ్న. దానివల్ల అదనపు ప్రయోజనమూ ఏమీ లేదని, కిందటిసారి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్ పక్షాన చేరి, కడకు అయిదుగురే మిగిలినా ప్రజలు స్పష్టమైన మెజారిటీతోనే కాంగ్రెస్‌ను గెలిపించుకోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు.

వలసలను ప్రోత్సహించడం ద్వారా నాటి బీఆర్‌ఎస్ కడకు ప్రజాగ్రహానికి గురికావల్సి వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను తాజాగా కాంగ్రెస్‌లో చేర్చుకో వడం కొంత దుమారమే లేపింది. ‘ఇది తప్పు అని’ ఇదే నియోజక వర్గానికి పలు దఫాలు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్సీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి.జీవన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి రాజీనామాకూ సిద్ధపడి పోతున్నారు. తనను కనీసం సంప్రదించకుండా జరిపిన ఈ దుందుడుకు చర్యను తానైనా, పార్టీ కార్యకర్తలైనా జీర్ణించుకోలేక పోతున్నారనేది ఆయన వాదన. అధినాయకత్వం ఢిల్లీకి పిలిపించి నచ్చజెప్పినప్పటికీ ఆయన వినేలా లేరని తెలుస్తున్నది. 

జాతకాల వేటలో పార్టీలు

కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు మా సాలు పూర్తయిన సందర్భంలో ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికరమైన అంశా లు వెలుగుచూశాయి. రాజకీయ పార్టీల అంచనాలకు, వాస్తవాలకు కొంత సామ్యం ఉన్నా, పలు విషయాల్లో వ్యత్యాసమే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. స్వీయబలం గురించిన బీజేపీ సొంత అంచనాలకు, క్షేత్ర వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పదిహేనేళ్ల పాలన తర్వాత బీజేపీ- ఎన్డీయే ప్రభుత్వం జాతీయ స్థాయిలో గట్టి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందనేది కాంగ్రెస్ వర్గాల ఆశగా ఉంది.

‘ఇండియా’ కూటమి తరపున రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయి ఉంటారని, ఈ అయిదేళ్లు సర్కారును జాగ్రత్తగా నడుపుకొంటే, కనీ సం మరో టర్మ్ అయినా తెలంగాణలో భవిష్యత్తు కాంగ్రెస్‌దే అన్న భావన పార్టీ వర్గాల్లో, వారి సానుభూతి పరుల్లోనూ వ్యక్తమవుతున్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీల’ మేర హామీల అ మలును, పరిపాలనా తీరును ప్రజలు గమనిస్తున్నారు.

ఇంకా బలంగానే బీఆర్‌ఎస్

కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు, ప్రత్యర్థి భయపడుతున్నట్టు ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్ పూర్తిగా కొట్టుకొని పోలేదు. జనాదరణ కోల్పోయి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేక పోయినా ప్రజాక్షేత్రంలో ఇంకా బలమైన శక్తిగానే కనబడుతున్నది. అయితే, ‘ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు వివిధ స్థాయి నాయకులను ఎంతమేర నిలబెట్టుకో గలుగుతుంది? పార్టీ శ్రేణులకు ఏ మేర ధీమా ఇవ్వగలుగుతుంది’ అన్నదే ప్రశ్న. ‘వలస’ పరిణామాలతో నిమిత్తం లేకుండా సంస్థాగతంగా, ప్రజా ఉద్యమాల పరంగా కార్య కర్తల్ని క్రియాశీలంగా ఉంచడం, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను ఒక అవకాశంగా మలచుకోవడంపైనే బీఆర్‌ఎస్ ‘పున ర్వైభవం’ ఆధారపడి ఉంటుంది.

‘వీళ్లు కాకపోతే... మళ్లీ వాళ్లే’ అనే జనవాక్యాన్నిబట్టి బీఆర్‌ఎస్ ఇంకా ప్రజల మదిలో ఉందనే తెలుస్తున్నది. విపక్షంగా బీఆర్‌ఎస్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ, ప్రజాపక్షం వహి స్తే మనుగడ, ప్రత్యామ్నాయంగా నిలిచే సత్తా ఉంటుందనేది జనం సగటు భావన. ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు పార్టీని వీడి పాలక పక్షంలోకి పోయినా బీఆర్‌ఎస్ బలపడటానికి ఆస్కారం ఉందన్నది వారి అభిప్రాయం. పార్టీ నాయ కులు, కార్యకర్తల శ్రేణులతో భేటీ సందర్భంగా పార్టీ అధినేత, కేసీఆర్ కూడా ఇదే చెబుతున్నారు. ‘జనం అవసరాలు, కార్యకర్తల బలం ఆధారంగా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం’ అంటున్నారాయ న. తెలంగాణ అస్తిత్వంతో ముడిపడి ఉన్న పార్టీ అయినందున, జరిగిన తప్పులకు క్షమాపణ కోరి, సరిదిద్దుకొని చిత్తశుద్ధితో ప్రజా ఉద్యమాలు నడిపితే తిరిగి అధికారంలోకి రాగల అవకాశం ఉంటుంది. ఇం దుకు అవసరమైన నాయకు లు, కార్యకర్త లు, సానుభూతిపరుల వ్యవస్థ ఇంకా పటిష్టంగానే ఉందని ప్రజాక్షేత్రం చెబుతున్నది.

నీడనుండి నిజంలోకి రావాలి

తెలంగాణలో బీజేపీ బలపడుతున్నట్టే కనిపిస్తున్నా సంస్థాగతంగా బలహీనంగా ఉంది. బీఆర్‌ఎస్‌ను నెట్టేసి, పాలక పక్షానికి ప్రత్యామ్నాయం కాగల స్థాయి ఇప్పటికైతే బీజేపీకి రాలేదన్నది జనవాణి. సంస్థాగతంగా బలపడటానికి సత్వర చర్యలు చేప ట్టి, స్థానిక సంస్థల ఎన్నికలను అవకాశంగా మలచుకుంటే, నిజమైన బలాన్ని నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. అదే ఊపు తో ముందుకు సాగితే కార్యకర్తల దన్ను, పైనుంచి ఢిల్లీ పెద్దల సహకారం తోడై తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగగలుగుతుంది. అంతే తప్ప, ‘పార్లమెంటులో 8 స్థానాలు గెలిచాం కాబట్టి, ఇక రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం’ అనుకుంటే, కిందటిసారి ఎదురైన భంగపాటే మున్ముందూ తప్పక పోవచ్చు. 2019లో గెలిచిన నాలుగు పార్లమెంటు స్థానాల పరిధిలో, వెంటనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగు జడ్పీటీసీలు కూడా గెలువ లేనప్పుడు అది ‘మోదీ’ పేరుతో వచ్చిన పాల నురగ తప్ప బలమె లా అవుతుంది?

ఈసారి గెలిచిన 8 లోక్‌సభ స్థానాల పరిధిలో 8 జడ్పీటీసీలో, 8 మున్సిపాలిటీలో కైవసం చేసుకోగల వ్యవ స్థ బీజేపీకి ఉండాలిగా? భవిష్యత్తులో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తాయనే ప్రచా రం ఉన్నా, ఆ ఆలోచన జనంలో లేదు. బీఆర్‌ఎస్ గత చరిత్రనుబట్టి సగటు ప్రజ లు ఆ దిశలో ఊహగానీ, ఆలోచనగానీ చేస్తున్నట్టు లేదు. కలిసినా పెద్ద వ్యతి రేకత రాకపోవచ్చనే అభిప్రాయం ఉంది. రాష్ట్రం నుంచి ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిం చారు కనుక పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేస్తే, భవిష్యత్తు ఉండవచ్చన్నది ఒక స్థూలాభిప్రాయం. రాజకీయ పార్టీలకు, ఇప్పటికైతే తెలంగాణ సామాజిక వర్గాల్లో మిశ్రమ సానుకూలత ఉంది. ఎదిగే అవకాశాలు కూడా, ‘దున్నుకున్నోళ్లకు దున్నుకున్నంత’!

-రచయిత పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ