18-04-2025 12:28:46 AM
కళ్యాణ లక్ష్మీ ,- షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత
మహేశ్వరం, ఏప్రిల్ 17:మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలంలో గురువారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి 105 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.అయితే చెక్కులు అందుకున్న మహిళలు ఒక్క మాటతో అధికారులను ఆశ్చర్యపరిచారు.
తులం బంగారం హామీ ఏమైంది? అని వేదికపైనే ప్రశ్నలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం అందిస్తామని చెప్పిందని గుర్తు చేస్తూ, ఆ హామీని నిలబెట్టుకోవాలని మహిళలు గట్టిగా డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి, హామీలను అమలు చేయాలి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.
దింతో కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం మొదలైనది.ఇరువురు కార్యకర్తలు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకునే వరకు పోవడంతో వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురు కార్యకర్తలను సముదాయించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.