calender_icon.png 14 October, 2024 | 3:54 AM

ఖాల్సా భూ పట్టా అందేదెప్పుడు?

14-10-2024 01:20:30 AM

సర్వే నంబర్ 1,146లోని ‘అసైన్డ్’ సమస్యకు పరిష్కారం ఏదీ?

ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రైతులు

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  ఖాల్సా సర్వే నంబర్ 1,146లోని అసైన్డ్ భూమి విస్తీర్ణం మొత్తం 138.04 ఎకరాలు కాగా, రెవెన్యూశాఖ పరిధిలో మాత్రం 165.05 ఎకరాలకు ధ్రువప త్రాలు అందాయి.

అంటే అదనంగా 27.03 ఎకరాలకు పత్రాలు అందాయి. ఈ అదనపు భూమి ఎలా రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కిందో తెలియదు కానీ, ఈ కారణంతో సుమారు 120 మంది రైతులకు పాస్ పుస్తకాలు అంద డం లేదు.

ఈ విషయమై బాధిత రైతులు రెవెన్యూశాఖ అధికారులను వివరణ కోర గా.. సదరు భూమి రికార్డుల్లో ‘ల్యాండ్ ఎక్సెస్’ చూపిస్తున్నదని, దీంతోనే సంక్షేమ పథకాలకు రైతులు అనర్హులుగా మిగిలిపోతున్నారని సమాధానమిస్తున్నారు. 

అన్యాక్రాంతమవుతున్నా..

మరోవైపు సదరు భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టిం చుకోకుండా ఓ ‘రిసార్ట్’ నిర్వాహకులకు మాత్రం సహకరించి, వారు వ్యాపారం చేసుకుంటున్నా పట్టించుకోకపోవడం గమనా ర్హం. అక్రమంగా రిసార్ట్ నిర్మాణం చేయడంపై ఫిర్యాదులు అందినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు స్థానిక ప్రజలు, రైతుల నుంచి వెల్లువెత్తుతున్నా యి.

అధికారులు నామమాత్రంగా రిసార్ట్‌ను తనిఖీ చేశారే తప్ప రిస్టార్ట్ నిర్వాహకులపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్వే నంబర్‌లో ఎంతోమంది రైతులకు భూములు ఉన్నాయి. వారంతా పాస్ పుస్తకాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూశాఖ అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని, తమకు పాస్ పుస్తకాలు అందించాలని బాధితులు కోరుతున్నారు.

భూ సమస్యపై ఖాల్సా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ను వివరణ కోరగా.. ప్రస్తుతం మండల పరిధిలోని సర్వేయర్ ఇబ్రహీంపట్నంతో పాటు మంచాల మండలాల్లో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని, ఈ కారణంతోనే ఖాల్సా భూమిని సర్వే చేయించలేకపోతున్నామని సమాధానాన్ని దాట వేశారు.

చెప్పులు అరిగేలా తిరిగాం..

నేను దివ్యాంగుడిని. అసైన్డ్ భూమే నాకు దిక్కు. నేను ధరణి పాస్ పుస్తకం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగా. అయినా ఫలితం లేకపోయింది. చేసేదేమీలేక నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నా. సదరు భూమి పొజిషన్‌లో ఉన్నప్పటికీ రెవెన్యూశాఖ నాకు పాస్ పుస్తకం ఇవ్వడం లేదు. ఈ కారణంగా ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే భూసమస్యను పరిష్కరించాలి. మాకు న్యాయం చేయాలి.

 కొంగరి జంగయ్య, రైతు, ఉప్పరిగూడ

పాస్ పుస్తకాలు అందజేయాలి..

భూ సమస్య గురించి ఎంతోమందికి మొరపెట్టుకున్నాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమస్యను పరిష్కరించడం లేదు. మా మండలంలో ఇప్పటివరకు ఎంతో మంది అధికారులకు మా సమస్య చెప్పుకొన్నాం. కానీ మా సమస్య పరిష్కారం కావడంలేదు. రెవెన్యూశాఖ ఇప్పటికైనా పట్టించుకుని మాకు ధరణి పాసు పుస్తకాలు అందజేయాలి. ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించాలి.

గొ నర్కుడి ఎల్లయ్య, రైతు, ఉప్పరిగూడ