calender_icon.png 20 September, 2024 | 8:09 PM

లిఫ్టులు బాగయ్యేది ఎప్పుడు?

13-07-2024 12:00:00 AM

హైదరాబాద్ శివార్లలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఉప్పల్ చౌరస్తా ఒకటి. ఓవైపు వరంగల్ హైవే, మరోవైపు ఎల్‌బీ నగర్ మీదుగా విజయవాడ హైవే. అటువైపు వెళ్లే రహదారిపై నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఈ చౌరస్తాలో పాదచారులు రోడ్డు దాటడం అంటే పద్మవ్యూహాన్ని ఛేదించడమే. దీనికి తో డు పక్కనే మెట్రో స్టేషన్. అన్నీ కలిసి నిత్యం వేలాదిమందితో రాత్రి పది గంటల దాకా కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. గతంలో ఇక్కడ ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ కష్టాలు చూడలేక పాదచారుల సౌకర్యార్థం స్కైవే నిర్మించింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం. దీనితో వృద్ధులు, మహిళలు, పిల్లలు, లగేజితో వెళ్లేవాళ్లకు మంచి సౌకర్యం లభించిందని అంతా సంతోషించారు.

ఈ స్కైవాక్ పైకి వెళ్లడానికి లిఫ్టులు కూడా ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తొలగి పో యాయి. అయితే, అది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఈ లిఫ్టుల్లో కొన్ని చెడిపోయి నెలలు గడుస్తున్నా వాటికి మరమ్మతులు చేసిన పాపాన పోవడం లేదు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు షరా మామూలై పోయాయి. వీటిని బాగు చేయాల్సిన బాధ్యత ఎవరిదో తెలియక, ఎవరికి తమ గోడు చెప్పుకోవాలో అర్థం కాక జనం అవస్థలు పడుతున్నారు. చెడిపోయిన లిఫ్టులవద్ద ఉండే సెక్యూరిటీ సి బ్బందిని అడిగితే తమకు కూడా తెలియదని, తమ డ్యూటీ మాత్రమే తాము చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఏదయినా ఒక సమస్య ఏర్పడితే దానికి తక్షణం పరిష్కారం చూపినప్పుడే ప్రజలకు ప్రభుత్వాల పట్ల గొప్ప విశ్వాసం కలుగుతుంది. 

 కె. వెంకటేశ్, ఉప్పల్