- ఓ వర్గం వారు 15 రోజులుగా సమావేశాలు పెట్టుకుంటుంటే పట్టింపేదీ
- మల్కాజిగిరి ఎంపీ ఈటల
- కుమ్మరగూడలోని ముత్యాలమ్మ ఆలయం సందర్శన
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఉన్మాదుల శిక్షణకు హైదరాబాద్ అడ్డాగా మారిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. శుక్రవారం సికింద్రాబాద్ కుమ్మరగూడలోని ముత్యాలమ్మ గుడిని ఈటల సందర్శించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూవులపై ద్వేషం పెంచేలా 15 రోజులుగా సికింద్రాబాద్ మెట్రోపొలిస్ హోటల్లో ఓ వర్గానికి చెందిన పలువురు సమావేశం పెట్టుకుంటే ఇంటెలిజన్స్ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ సమావేశానికి వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఉన్మాదులపై చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాకపోతే కేంద్ర ప్రభుత్వం సాయం కోరాలన్నారు. స్థానిక ఎంపీగా ఇక్కడ జరిగిన సంఘటనలన్నింటిపై కేంద్ర హోంశాఖకు నివేదిక అందిస్తానని చెప్పారు.
ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తే జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. అమ్మవారి ఆలయంపై దాడికి నిరసనగా స్థానికులు సికింద్రాబాద్ బంద్కు పిలుపునిచ్చారని.. వ్యాపారస్థులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు మద్ధతివ్వాలని కోరారు. కార్పొరేటర్ కొంతం దీపిక, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.