వైద్యుల నియామకంపై నివేదిక ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక కోఠి ప్రసూతి దవాఖానలో ఖాళీగా ఉన్న చిన్నపిల్లల వైద్యుల పోస్టులను ఒక నెలలోగా భర్తీ చేయాలని, ఖాళీగా ఉన్న సివిల్ సర్జన్, ఇతర పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దవాఖాన కొత్త భవనంలో ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు, తాగేందుకు నీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలని సూచించింది.
కోఠి ప్రసూతి దవాఖానలో సౌకర్యాలు లేకపోవడంపై 2016లో పత్రికల్లో వచ్చిన కధనాలకు హైకోర్టు సుమోటో పిల్గా స్వీకరించి సోమవారం విచారణ జరిపింది. చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జే అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ పిల్పై విచారణ చేపట్టింది. ప్రభుత్వ లాయర్ ఎ శ్రీధర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఆ సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. ప్రస్తుతం 244 పోస్టులకుగా 144 భర్తీ చేశామని మరో 100 పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నదని వివరించారు. దీంతో ధర్మాసనం ప్రభుత్వ చర్యలతో నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.