19-02-2025 12:33:23 AM
వీర రాఘవరెడ్డిని విచారిస్తున్న పోలీసులు
చేవెళ్ల, ఫిబ్రవరి 18: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏ1 వీర రాఘవరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
మంగళవారం మధ్యాహ్నం పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. రామరాజ్యం సంస్థ ఎందుకు స్థాపించారు? దాని లక్ష్యమేంటి? సభ్యుల రిక్రూట్మెంట్, ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకునేవారు తదితర అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్ను ఎప్పుడు కలిశారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అని ఆరా తీసినట్లు తెలిసింది. వీర రాఘవ రెడ్డిపై గతంలో నమోదైన కేసులపైనా ఆరా తీశారు.
సీన్ రీ కన్స్ట్రక్షన్కు అవకాశం
వీర రాఘవరెడ్డిని నేడు, రేపు కూడా విచారించనున్న పోలీసులు.. రంగరాజన్పై దాడి ఘటన సీన్ను రీ కన్స్ట్రక్షన్ చేయనున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా వీర రాఘవరెడ్డి సమాధానాలన్నీ హిందూ మతం, ధర్మం, వంశం, గోత్రం చుట్టే తిరిగాయని తెలిసింది.
ఫేస్బుక్, యూట్యూబ్లో రామరాజ్యం పేరుతో చానెళ్లు ఏర్పాటు చేసి సభ్యులను నియమించుకొని వారికి నెలకు రూ.20 వేలు జీతం ఇస్తున్నానని, సైన్యాన్ని పెంచుకునేందుకు ప్రముఖ ఆలయాల అర్చకులను కలిసినట్లు, వారి ఆలయాల పరిధిలో శాస్త్రం తెలిసిన వారిని గుర్తించి తమకు అప్పజెప్పాలని కోరినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం.