06-04-2025 12:00:00 AM
పెళ్లి తర్వాత వివిధ కారణాల రీత్యా మానసిక సమస్యల బారిన పడుతోన్న అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని చెబుతున్నారు పలు అధ్యయనాలు. దీన్నే ‘పోస్ట్ మ్యారేజ్ డిప్రెషన్’ గా పేర్కొంటున్నారు నిపుణులు. పెళ్లికి ముందు వరకు బ్యాచిలర్గా గడిపిన అమ్మాయిలు.. పెళ్లయ్యాక అంత స్వేచ్ఛగా ఉండలేరు. కుటుంబ బాధ్యతలు, అత్తమామల్ని చూసుకోవడం.. వంటి కొత్త బాధ్యతల్ని భుజాలకెత్తుకోవాల్సి వస్తుంది.
ఈ క్రమంలో ఆయా బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తామో, లేదోనని ఆందోళన చెందటం వల్ల కుంగుబాటుకు గురవుతున్నారట. కొంతమంది పెళ్లి తర్వాత ఉమ్మడి కుటుంబాల్లో ఉండాల్సి రావచ్చు. ఈ క్రమంలో వాళ్లందరి మనస్తత్వాలు వేరుగా ఉండచ్చు.. తద్వారా ఆ వాతావరణంలో ఇమడలేకపోవచ్చు. పెళ్లి తర్వాత ఉద్యోగాలు కొనసాగించే వారు మరింత ఒత్తిడి, ఆందోళనలకు గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.
పెళ్లి తర్వాత డిప్రెషన్కు ఆర్థిక విషయాలు కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు. అప్పటిదాకా తమ సంపాదనను స్వేచ్ఛగా ఖర్చు పెట్టడం, పొదుపు చేసుకోవడం.. వంటివి చేసిన తమకు పెళ్లయ్యాక అంత స్వేచ్ఛ దొరక్కపోవచ్చని, పైగా తమ సంపాదన భాగస్వామి లేదా అత్తింటివారి చేతుల్లోకి వెళ్తుందేమోనన్న ఆందోళన చాలామందిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుందంటున్నారు.