calender_icon.png 19 September, 2024 | 7:34 AM

57 ఏళ్లకు మార్పులెలా చేస్తారు?

17-09-2024 01:46:06 AM

  1. రెవెన్యూ రికార్డుల్లో సవరణలు సివిల్ కోర్టులోనే 
  2. హైకోర్టు తీర్పు

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): 57 ఏండ్ల తర్వాత రెవెన్యూ రికా ర్డుల్లో పేరు మార్చాలని కోరడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పేరు మార్పునకు నిర్ధిష్ట గడు వు అనేది చట్టంలో లేకపోయినప్పటికీ సుదీర్ఘకాలం తర్వాత ఇలాంటి వ్యవహారాలపై ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని గుర్తు చేసింది. ఈ వివాదాన్ని సంబంధిత సివిల్ కోర్టులో తేల్చుకో వాలన్న ప్రత్యేక ట్రైబ్యునల్, సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సమర్థించింది. రెవెన్యూ రికార్డుల్లో పద్దులను 57 ఏళ్ల తరువాత మార్చాలని కోరజాలరని స్పష్టం చేసిం ది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలోని భూమి వివాదంపై సాగి హనుమంతరావు దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.

బూరుగుపల్లిలో సర్వేన నెం.177, 184, 185, 187లో పిటిషనర్ తల్లి 64.30 ఎకరాలను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ భూమి తమ అధీనంలోనే ఉంది. అయితే 5.19 ఎకరాలకు సంబంధించి పహాణి స్వాధీనదారు పద్దులో ప్రైవే టు వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ భూమిని రెవెన్యూ పద్దుల్లో సవరించాలంటూ 2019 లో అప్లికేషన్ పెట్టుకుంటే దానిని ఎమ్మార్వో స్పెషల్ రెవెన్యూ ట్రైబ్యునల్‌కు పంపారు. ఇది ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల సివిల్ వివాదమని ట్రైబ్యునల్ జడ్జిమెంట్ ఇచ్చింది.

దీనిని హనుమంతరావు హైకోర్టులో సవాల్ చేశారు. సింగిల్ జడ్జి కూడా ట్రైబ్యునల్ నిర్ణయాన్ని సమర్థిస్తూ సివిల్ కోర్టులో తేల్చు కోవాలని తీర్పు చెప్పారు. ఈ తీర్పును రద్దు చేయాలంటూ హనుమంతరావు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారణ పూర్తి చేసి తాజా తీర్పును ప్రకటించింది. ఇదే సమయంలో పిటిషనర్లు తమ ఆస్తిపై హక్కుల వివాదాన్ని చట్టప్రకారం సివిల్ కోర్టులో తేల్చుకోవచ్చునని స్పష్టం చేసింది.