ప్రభుత్వాన్ని కోరిన హైకోర్టు
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువులలతోపాటు ఇతర జంతువులను హింసించేవాళ్లపై తీసుకున్న చర్యల ఏమిటో తెలుపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2020 ఆగస్టు 14న కేంద్ర జంతు సంక్షేమ మండలి జారీ చేసిన సర్క్యులర్ మేరకు జంతువులను హింసించేవారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ హెదరాబాద్కు చెందిన సీఎస్ సుదీబ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి సోమవారం విచారించారు. న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ గత సంవత్సరం డీజీపీకి జంతు ప్రేమికులు వినతిపత్రం ఇచ్చినా ఏ విధమైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. జంతు సంక్షేమ మండలి సర్క్యులర్ మేరకు జంతువులపై హింసకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేయడం లేదని చెప్పారు. దీంతో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ధర్మాసనం విచారణను ఆగస్టు 12వ తేదీకి వాయిదా వేసింది.