- భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు
- మీడియా, సోషల్ మీడియాలో వీడియోలను తొలగించాలి
- కొండా సురేఖపై కేటీఆర్ పరువునష్టం దావా కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నాంపల్లి కోర్టు
- తదుపరి విచారణ వచ్చే నెల 21వ తేదీకి వాయిదా
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన రూ. 100 కోట్ల పరువు నష్టం కేసులో మంత్రి సురేఖకు నాంపల్లి కోర్టు మొట్టికాయలు వేసింది.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొంది. కేటీఆర్పై సురేఖ వ్యాఖ్యలను నాంపల్లి కోర్టు సీరియస్గా పరిగణించింది. భవిష్యత్లో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్య లను కేటీఆర్పై చేయవద్దని కొండా సురేఖను ఆదేశించింది.
అత్యంత జుగుస్సాకరంగా ఉన్న ఆ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, వెబ్సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ సంస్థలకు కూ డా ఈ వ్యాఖ్యలను తొలగించాలని ఆదేశించింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. సురేఖ చేసిన వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్లో ఉండవద్దని కోర్టు తెలిపింది.
మంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఆగ్రహం ఇదే మొదటిసారి: బీఆర్ఎస్ శ్రేణులు
పరువు నష్టం కేసుకు సంబంధించిన ఓ కేసులో మంత్రిస్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశార ని, ఎన్నికల సంఘం ఆమె వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిందన్నారు.
అయినప్పటికీ మంత్రి కొండా సురేఖలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శిస్తున్నారు. తన వ్యక్తిత్వ హననం చేసే విధంగా చేసే ఏ ఆరోపణలను సహించేది లేదని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇకపై తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ఆయన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కోర్టు తాజా కామెంట్లతో కేటీఆర్కు బలం చేకూరినట్లుంది.