28-04-2025 03:45:55 PM
హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్
మహబూబాబాద్,(విజయక్రాంతి): హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఐఎఫ్టియు అనుబంధ హమాలీ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 139వ మేడే ను జయప్రదం చేయాలని కోరుతూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ముద్రించిన గోడ పత్రికలను సోమవారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పర్వత కోటేష్ మాట్లాడుతూ... స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నిత్యం బరువులు మోసే హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, 139వ మే డే లో కార్మికులు సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేష్, లింగన్న, రామ్మూర్తి, ఉప్పలయ్య, వెంకన్న, రవి, వెంకటేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.