calender_icon.png 25 October, 2024 | 8:58 AM

తియ్యని అందాలకు స్వాగతం

03-08-2024 12:05:00 AM

చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన అందం, అభినయంతో తెలుగు తెరపై ‘ఉప్పెన’ సృష్టించి టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది కృతిశెట్టి. అలా తెలుగులో తొలి సినిమాతోనే ఎంతో మందికి అభిమాన హీరోయిన్‌గా మారిపోయిన ఈ అమ్మడు ‘మనమే’ చిత్రంతో ప్రేక్షకులను పలుకరించింది. తర్వాత కొన్ని అవకాశాలు ఆశించిన ఫలితాలు తెచ్చిపెట్టలేకపోయాయి.

దీంతో తెలుగు ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న ఈ సొగసరి మలయాళం, తమిళ ఇండస్ట్రీలో మాత్రం చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న వాటిల్లో ‘ఎల్‌ఐకే ఇన్సూరెన్స్ కంపెనీ’ చెప్పుకోదగ్గ చిత్రం. సీనియర్ నటి నయనతార నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆమె భర్త విఘ్నేశ్ శివన్ రచన బాధ్యతలు తీసుకున్నారు. ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది.

ఇందులో రెండు జడలతో ఓ యానిమేషన్ బొమ్మలా కనిపిస్తోంది కృతి. ఈ ‘ఎల్‌ఐకే’ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న విఘ్నేశ్ శివన్ కృతిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌కు ఆసక్తికరమైన వ్యాఖ్యలు జోడించారు. ‘అందం, ప్రతిభ కలగలిసిన తియ్యటి గుత్తి లాంటి అమ్మాయిని మా చిత్రంలోకి తీసుకోవటం సంతోషంగా ఉంది’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతూ స్వాగతం పలికాడు.