23-03-2025 01:50:09 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి,(విజయక్రాంతి): వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు రైతులకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని ఎలిగేడు, ధూళికట్ట జూలపల్లి, కొనరావుపేట, జూలపల్లి, చీకురాయి, బొజన్నపేట హనుమంతునిపేట గ్రామాల్లో ఆదివారం పర్యటించి నష్టపోయిన పంటలను అధికారులు, స్థానిక నాయకులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు మాట్లాడుతూ... అకాల వర్షం ద్వారా నియోజకవర్గంలోని జూలపల్లి మండలంలోని కోనరావుపేట, జూలపల్లి గ్రామాలల్లో, ఎలిగేడు మండలంలోని దూళికట్ట గ్రామంలో పెద్దపల్లి మండలంలోని బోజన్నపేట, చీకురాయి, హనుమంతునిపేట గ్రామాల రైతుల వరి, మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని, తక్షణమే నష్టపోయిన రైతుల పంట పొలాలతో పాటు మొక్కజొన్నను అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ రామ కృష్ణా రావు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు. గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులు ఎప్పుడు నష్టపోయిన పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం తాము రైతుల పక్షాన నిలబడి వారిని నష్టపోకుండా కృషి చేస్తున్నామన్నారు. అలాగే రైతులందరూ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకున్నామని ప్రతి రైతు గుంట భూమి కూడా ఎండిపోకుండా నీరు అందించేందుకు తాను కృషి చేస్తానని ఎట్టి పరిస్థితిలో రైతులు తూములు కాలువ గట్లను ధ్వంసం చేసి నీరును వృధా చేయవద్దని అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని, తప్పకుండా ప్రతి రైతుకు నీరును అందించేందుకు సహకరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.