13-12-2024 12:42:40 AM
* ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్
* ఎస్సీ సంఘాల నుంచి వినతుల స్వీకరణ
ఖమ్మం, డిసెంబర్ 12 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణపై అందిన వినతులు, సూచనలను క్రోడీకరించి, నివేదిక రూపొందించి రాష్ట్రప్రభుత్వానికి నివేదిస్తామని ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ స్పష్టం చేశారు. ఖమ్మంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఎస్సీ వర్గీకరణపై నిర్వహించిన బహిరంగ విచారణలో ఆయన మాట్లాడారు.తొలుత కమిషన్ ఉమ్మడి జిల్లా నుంచి ఎస్సీ, ఉప కులాలు, కుల సంఘాల నేతలు అందించిన వినతులు స్వీకరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. వినతులపై శాస్త్రీయ అధ్యయనం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరైనా నిర్భయంగా, స్వేచ్ఛగా కమిషన్కు వినతులు సమర్పించవచ్చని సూచించారు. కమిషన్ ఇప్పటికే ఉమ్మ డి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బహిరంగ విచారణ పూర్తి చేసిందన్నారు.
జిల్లాల పర్యటనలో వినతులు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్కు వచ్చి నేరుగా కమిషన్కు అందించవచ్చని పేర్కొన్నారు. అనంత రం చైర్మన్ ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. తల్లంపాడు ఎస్సీ కాలనీలో కలియదిరిగారు. కాలనీవాసుల స్థితిగతులపై స్థానికులను ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి వారికి అందుతున్న సంక్షేమ పథకాల గురిం చి తెలుసుకున్నారు. పిల్లల చదువులు, ఖర్చులపై మహిళలను విచారించారు. అంతక ముందు ఖమ్మం చేరుకున్న కమిషన్ చైర్మన్కు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ స్వాగతం పలి కారు. పర్యటనలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ శ్రీధర్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు కె.సత్యనారాయణ, అనసూయ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు తదితరులున్నారు.
వర్గీకరణతో న్యాయం చేయాలి
ఎస్సీవర్గీకరణతో ప్రభుత్వాలు అన్ని ఉప కులాలకు న్యాయం జరిగేలా చూడాలని పీసీసీ మాజీ కార్యదర్శి, ఎస్సీ సంఘం నేత వక్కలగడ్డ సోమచంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ సీఎం రేవంత్రెడ్డి ఎస్సీ వర్గీకరణకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అనంతరం ఆయన పలువురు నాయకులతో కలిసి కలెక్టరేట్లో ఏకసభ్య కమిషన్ చైర్మ న్ షమీమ్ అక్తర్కు వర్గీకరణపై వినతి పత్రం అందజేశారు.