18-04-2025 01:40:24 AM
భీమదేవరపల్లి, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం తొలగిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ ను భీమదేవరపల్లి మండలానికి రాకుండా అడ్డుకుంటామని బిజెపి నాయకులు మండల శాఖ అధ్యక్షులు శ్రీ రామోజీ శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి పృథ్వీరాజ్ హెచ్చరించారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతం కాని వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే అనేక రకాల అభివృద్ధి అడుగంటుందన్నారు. ఎల్కతుర్తి వలె ముల్కనూర్ లో కూడా అంబేద్కర్ జంక్షన్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఉన్న చోటనే అంబేద్కర్ విగ్రహం ఉండే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ముల్కనూరులోని అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు ఉన్న చోటనే ఉంటుందని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఒకవేళ అంబేద్కర్ విగ్రహం తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తే భీమదేవరపల్లి మండలంలోని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీ నాయకులు, దళిత సంఘాలు, ప్రజలు ప్రతి ఒక్కరిని కలుపుకొని ఆందోళన చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దొంగల కొమురయ్య ,బైరి సదానందం, బొజ్జపురి పృథ్వీరాజ్ అలుగు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.