14-02-2025 12:16:06 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాం తి): కృష్ణా జలాల విషయమై ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోమ ని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపు వ్యవహారంలో ఏపీ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చిన నేపథ్యం లో అధికారులు, న్యాయవాదులతో కలిసి గురువారం హాజరైనట్టు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసిందని, ఈ నెల 25 కల్లా అన్ని వాదనలపై షార్ట్ నోట్స్ సమర్పించాలన్నారని చెప్పారు. ఈ నెల 19 నుంచి 21 వరకు జరగాల్సిన బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారణ యథాతథంగా ఉంటుందని పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వ వాదనలకు మద్దతుగా నిలిచిందని, ఇది రాష్ట్ర హక్కులను రక్షించడంలో ముందడుగని తెలిపారు. విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఉత్తమ్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, న్యాయవాదులు వైద్యనాథన్, గోపాల్ శంకర్ నారాయణ, అంతర్రాష్ట్ర నీటి వనరుల విభాగం అధికారులు, ఈఎన్సీ హాజరయ్యారు.