16-04-2025 12:04:35 AM
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో జరిగిన ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా 43వ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన పాలకుల బుద్ధి మారడం లేదన్నారు. విద్యారంగంపై ఏ ప్రభుత్వం వచ్చినా సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని విమర్శించారు. విద్యా రంగానికి బడ్జెట్ కేటాయించడంలో అభివృద్ధి పరచటంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు సంవత్సరాలుగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రూ.4,500 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస మౌలిక వసతులు లేవని, మౌలిక వసతులు కల్పించి , ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, యూనివర్సిటీలలో ప్రొఫెసర్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులను తక్షణమే భర్తీ చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా లెనిన్,అశోక్ రెడ్డి లను తిరిగి ఎన్నుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు గా స్టాలిన్, రమ్య ,నాగేందర్ ,శ్రీమన్ సహాయ కార్యదర్శిగా విగ్నేష్ ,రజినీకాంత్,సహనలను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.